
మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన కండక్టర్
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు గ్యారంటీ కార్డు పథకాల్లో భాగంగా కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే వాగ్దానం కండక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
మహిళలు టికెట్ తీసుకోకుండా కండక్టర్లతో గొడవలు పడుతున్న ఘటనలు రోజూ జరుగుతున్నాయి.
కాగా చెకింగ్ సిబ్బంది కండక్టర్లనే బాధ్యులను చేస్తున్నారు. వివరాలు.. శుక్రవారం భాల్కి నుంచి బీదర్ మీదుగా హైదరాబాద్ వెళుతున్న బస్సును ఖానాపూర్ వద్ద అధికారులు తనిఖీ చేశారు.
ఆ సమయంలో టికెట్ తనిఖీ అధికారులు ఓ మహిళ వద్ద టికెట్ లేకపోవడంపై కండక్టర్పై మండిపడ్డారు. ఆమెకు టికెట్ ఎందుకివ్వలేదని నిలదీశారు.
ఉచిత రవాణా సదుపాయం అంటూ ప్రకటించిన నేపథ్యంలో తాను టికెట్ తీసుకోలేదని ప్రయాణికురాలు చెప్పినా అధికారులు కండక్టర్ను మందలించి క్రమశిక్షణ చర్యలకు పూనుకున్నారు.
దీంతో మనస్తాపానికి గురైన కండక్టర్ రామకృష్ణ డ్యూటీ ముగిసిన అనంతరం బీదర్ డిపో ముందు తాడుతో ఉరి వేసుకునేందుకు యత్నించాడు. తోటి సిబ్బంది, ఉద్యోగులు గమనించి కండక్టర్ను రక్షించారు.