
అయ్యో పాపం.. చూస్తుండగానే మ్యాన్ హోల్లో పడిపోయాడే
ప్రస్తుతం ఏ సీజనో కూడా జనాలకు అర్థం కావడంలేదు. మే నెల మధ్యకు వస్తుంది.. ఈ టైంలో భానుడు భగభగామండాల్సింది పోయి.. వరుణుడు కనికరం లేకుండా జోరుగా వాన కురిపిస్తున్నాడు.
చెరువులు ఎండిపోవాల్సిన టైంలో నిండి అలుగులు పోస్తున్నాయి.
దీంతో కాలం మారిందా అన్న ఆలోచనలో జనాలున్నారు. ఈ మధ్య జరుగుతున్న సంఘటన దృష్ట్యా.. వానలు కురుస్తున్న సమయంలో రోడ్డుపై నడుస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి.
ఎందుకంటే ప్రమాదం ఎటునుంచి వస్తుందో చెప్పలేం. కాస్త అజాగ్రత్త వహించినా ప్రాణాలకే ప్రమాదం. ఏ మాత్రం తేడా జరిగినా శాల్తీ గల్లంతే.
దేశంలోని నగరాల్లో మ్యాన్ హోల్స్ సంగతి తెలిసిందే. వర్షాలు కురుస్తున్న సమయంలో అవి పొంగిపొర్లడం కామన్. రోడ్లన్నీ చిన్నపాటి చెరువులై పోతాయి.
ఏది రోడ్డో, ఏది మురికి కాలువో, ఏది గుంతో అస్సలు తెలియదు. ఇక మ్యాన్స్ హోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వర్షాల సమయంలో ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్స్ లో పడిపోయి ఎంతోమంది చనిపోయారు. అలాంటి తాజా ఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గజియాబాద్లో చోటు చేసుకుంది.
ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంతదూరం వెళ్లాక ఆ ప్రాంతం అంతా నీటితో నిండిపోయింది.
ముందుకెళ్లాలంటే నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే. గత్యంతరం లేక ఓ వ్యక్తి నీళ్లలో కాలు పెట్టాడు. అంతే, మ్యాన్ హోల్ లో పడిపోయాడు. ఇది చూసిన వెనకాలే ఉన్న వ్యక్తి షాక్ తిన్నాడు.
నీళ్లలో పడిన వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అందుకోసం అతడు కాలు కింద పెట్టాడు. అంతే, అతడు కూడా మ్యాన్ హోల్ లో పడిపోయాడు.
ఇది చూసిన చుట్టుపక్కల జనం పరిగెత్తుకుని వచ్చారు. ముందుగా ఓ వ్యక్తిని వారు కాపాడారు. బయటకు లాగేశారు. మరో వ్యక్తి నీళ్లలోనే ఉండిపోయాడు. కొన్ని సెకన్ల వ్యవధి తర్వాత అతడు బయటికి తేలాడు.
వెంటనే అక్కడున్న వారు అతడిని కూడా పైకిలాగేశారు. అలా ఆ ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.