తన చితి తానే పేర్చుకుని 90 ఏళ్ల వృద్ధుడి ఆత్మాహుతి

Spread the love

వంతుల జీవితం భారమైంది.. కన్న హృదయం బద్దలైంది..
తన చితి తానే పేర్చుకుని 90 ఏళ్ల వృద్ధుడి ఆత్మాహుతి!

ఈ తండ్రి కష్టం ఎవరికి రాకూడదు..90 ఏళ్ల వయసులో తనకు తానే చితి పేర్చుకుని!
సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలో దారుణం తొంభై ఏళ్ల వయసు.. భార్య గతంలోనే కాలం చేసింది.. నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తనకున్న ఆస్తిని కుమారులకు పంచి ఇచ్చారు.. అయితే కన్నతండ్రిని వంతులవారీగా పోషించాలన్న వారి నిర్ణయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. తన సొంతూరిని వదిలి.. మరో ఊరికి వెళ్లడం ఇష్టం లేకపోయింది.

తన పోషణ తనయులకు భారం కాకూడదనుకున్నారేమో.. ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. చితి పేర్చుకుని ఆత్మాహుతికి పాల్పడి తనువు చాలించారు. ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లిలో జరిగింది. పొట్లపల్లికి చెందిన మెడబోయిన వెంకటయ్య(90)కు నలుగురు కుమారులు కనకయ్య, ఉమ్మయ్య, పోచయ్య, ఆరయ్య, ఒక కుమార్తె ఉన్నారు.

కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలో, ఒకరు హుస్నాబాద్‌లో, మరొకరు కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో నివసిస్తున్నారు. వెంకటయ్య భార్య గతంలోనే చనిపోయింది. ఆయనకున్న నాలుగెకరాల భూమి కుమారులకు పంచేశారు. కుమారులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు.

వెంకటయ్యకు వృద్ధాప్య పింఛను వస్తోంది. గ్రామంలోనే ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉండేవారు. అయితే, ఆయన పోషణ విషయంలో అయిదు నెలల క్రితం పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది.

నెలకు ఒకరు చొప్పున నలుగురు కుమారులు వంతులవారీగా పోషించాలని నిర్ణయించారు. గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య వద్ద వంతు పూర్తి కావడంతో నవాబుపేటలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది.

సొంత ఊరిని, ఇంటిని వదిలి.. అక్కడికి తాను వెళ్లనని చెప్పేవారు. ఈ నెల 2న(మంగళవారం) సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన ఆయన గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. అక్కడ తన బాధ వెళ్లగక్కారు. 3న(బుధవారం) ఉదయం నవాబుపేటలోని తన మరో కుమారుడి ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సాయంత్రం వరకు ఏ కుమారుడి ఇంటికీ వెళ్లలేదు. గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం వెంకటయ్యదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు.

ఘటనాస్థలంలో తాటికమ్మలను ఒకచోట కుప్పగా వేసి వాటికి నిప్పంటించి, అందులో దూకి ఆత్మాహుతికి పాల్పడినట్లు భావిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ మణెమ్మ తెలిపారు.

2,991 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?