
ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. డెలివరీ కోసం వెళితే కడుపులో క్లాత్ వదిలేసిన డాక్టర్లు.. చివరకు..
ఆపరేషన్ చేశారు.. కడుపులో క్లాత్ మర్చిపోయారు.. తాపీగా కుట్లు వేశారు.. ఇదీ జగిత్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్వాకం.
డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ మహిళా పేషెంట్ నెలల తరబడి నరకం అనుభవించింది.
తిన్న అన్నం జీర్ణం కాలేక కడుపునొప్పితో పడిన బాధలు వర్ణనాతీతం.
జగిత్యాల జిల్లాకు చెందిన నవ్య 16 నెలల క్రితం డెలివరీ కోసం జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో అడ్మిట్ అయింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.
ఆ తర్వాత నవ్యకు ఇబ్బందులు మొదలయ్యాయి. రోజూ కడుపునొప్పితో అవస్థలు పడింది. ఆమె పరిస్థితిని చూసి కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు.
లాభం లేదనుకుని నవ్యను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అక్కడి వైద్యులు స్కానింగ్ తీస్తే భయంకరమైన నిజం తెలిసింది. కడుపులో క్లాత్ ఉన్నట్టు గుర్తించారు.
ఆపరేషన్ చేసిన డాక్టర్లు క్లాత్ను బయటకు తీశారు. క్లాత్ను బయటకు తీస్తుండగా వీడియో తీశారు. ఇన్ని రోజులు అంత పెద్ద సైజులో ఉన్న క్లాత్ కడుపులో ఉంచుకుని ఎంత నరకం అనుభవించిందో ఆలోచిస్తేనే ఒళ్లు జలదరిస్తోంది.
ఆపరేషన్కి చేశాక కడుపులోంచి క్లాత్ తీస్తున్న విజువల్స్ చూస్తేనే భయంకరంగా ఉన్నాయి.
సాధారణంగా ఆపరేషన్ థియేటర్లో కాటన్ క్లాత్ ఉంటుంది. కానీ విజువల్స్లో మాత్రం వేరే క్లాత్ కనిపిస్తుంది.
ఆ క్లాత్ ఆపరేషన్ థియేటర్లోకి ఎలా వచ్చింది..? ఎందుకిలా చేశారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దాదాపు ఆ క్లాత్ మీటర్ పొడవు ఉంది. అంత పెద్ద సైజున్న క్లాత్ని కడుపులో పెట్టి కుట్లు వేశారు. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్తో పాటు అసిస్టెంట్లు కూడా ఉంటారు.
వారిలో ఏ ఒక్కరు కూడా గమనించకపోవడం నిర్లక్ష్యం కాదా? అని బాధిత కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో కడుపులో కత్తెర్లు మరచిపోయిన ఘటనలు కూడా చూశాం. డాక్టర్లు ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటున్నారు.
ప్రస్తుతానికి నవ్య సేఫ్. కానీ ఏదైనా జరక్కూడనిది జరిగితే? దానికి బాధ్యులెవరు? ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలంటేనే సామాన్య జనం ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు.
పైగా ఇలాంటి ఘటనలు చూస్తే ఎవరైనా అటువైపు వెళ్తారా డాక్టర్లు ఎందుకిలా చేస్తున్నారు? వైద్యో నారాయణో హరి అంటారు. కానీ కొంతమంది డాక్టర్లు ఆ అర్ధాన్ని మార్చేస్తున్నారు.