
కొత్తగూడెంలో అమానుషం… బూటుకాలితో గుండెలపై తన్నడంతో వృద్దుడు మృతి
వృద్ద దంపతులపై అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డాడో కసాయి. కాళ్లు పట్టుకుని బ్రతిమాలినా ఈ కసాయి మనసు కరగలేదు.
ఎదురుతిరిగే పరిస్థితిలో కూడా లేని ముసలివాళ్లపై జాలి దయ చూపకుండా విచక్షణారహితంగా దాడికి పాల్పడి చివరకు ఒకరి ప్రాణాలను బలితీసుకున్నాడు.
ఈ అమానుషం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెంలోని కూలీ లైన్ ప్రాంతంలో దొడ్డ పోచయ్య(75), లచ్చమ్మ(60) దంపతులు నివాసముంటున్నారు.
వీరికి సంతానం లేకపోవడంతో దగ్గరి బంధువుల కొడుకును దత్తత తీసుకుని పెంచుకున్నారు. ఈ కొడుకు చందర్ గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు.
వృద్ద దంపతులు స్థానిక కూరగాయల మార్కెట్ లో పనిచేసుకుంటున్నారు.
అయితే హరిప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ డెలీవరీ చేసిన సమయంలో భార్య ఫోన్ నెంబర్ తీసుకున్నాడు చందర్.
ఈ క్రమంలోనే తన భార్యకు నిత్యం ఫోన్ చేసి వేధిస్తున్నాడని చందర్ పై కోపంతో రగిలిపోయాడు హరిప్రసాద్.
ఇటీవల చందర్ ఇంటి ఆచూకీ తెలుసుకున్న అతడు ఆవేశంతో వెళ్లగా ఆ సమయంలో పోచయ్య, లచ్చమ్మ దంపతులు మాత్రమే వున్నారు.
కొడుకుకు బుద్ది చెప్పాలని… మరోసారి తన భార్యకు ఫోన్ చేస్తూ అంతు చూస్తానని హెచ్చరించి వెళ్లిపోయాడు.
నిన్న(ఆదివారం) చందర్ తల్లిదండ్రుల వద్దకు వచ్చాడని తెలుసుకున్న హరిప్రసాద్ ఆగ్రహంతో వారి ఇంటికి వెళ్లాడు.
ఈసారి కూడా చందర్ దొరక్కపోవడంతో వృద్ద దంపతులపై ప్రతాపం చూపించాడు. వృద్దులను విచక్షణారహితంగా కొడుతూ బూటుకాలితో పోచయ్య ఎదపై తన్నాడు.
దీంతో కుప్పకూలిపోయిన పోచయ్య ప్రాణాలు కోల్పోయాడు. లచ్చమ్మ కూడా తీవ్రంగా గాయపడింది.
ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయాలతో పడివున్న లచ్చమ్మను హాస్పిటల్ కు తరలించారు.
అనంతరం పోచయ్య మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో వున్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.