
రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మృతి
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత పాటిల్ నీరజారెడ్డి(50) మృతి చెందారు.
కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బీచుపల్లి వద్ద కారు టైర్ పేలి బోల్తా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే కర్నూలు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నీరజారెడ్డి భర్త శేషిరెడ్డి గతంలో పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురయ్యారు. నీరజారెడ్డికి ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు.
నీరజారెడ్డి 2009 నుంచి 2014 వరకు ఆలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు.
అంతకుముందు పత్తికొండ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా దేవరకొండ మండలం ఆలూరు నియోజకవర్గంలో చేరడంతో 2009లో ఆలూరులో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు.
పీఆర్పీ అభ్యర్థిపై 5వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత వైకాపా గూటికి చేరారు. అక్కడ ఇమడలేక ప్రస్తుతం భాజపాలో కొనసాగుతున్నారు.