విద్యార్థులపై చేయి చేసుకున్న ఎస్సై పై వేటు

Spread the love

ఎస్సై దివాకర్ యాదవ్‌పై వేటు

విద్యార్థులపై చేయి చేసుకున్న అనకాపల్లి సబ్ ఇన్స్‌పెక్టర్ దివాకర్ యాదవ్‌పై వేటు పడింది. ఎస్సై దివాకర్‌ను వీఆర్ (వీకెండ్ రిజర్వుడ్)కి అప్పగిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

అనకాపల్లిలో జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో డివిజన్ కాలేజీ ప్రాంగణం నుంచి కొంతమంది విద్యార్థులు జై జనసేన అని నినదించారు. ఈ నేపథ్యంలో పట్టణ ఎస్సై దివాకర్ యాదవ్ దురుసుగా వ్యవహరించారు.

విద్యార్థులను సున్నితంగా మందలించాల్సిన ఎస్ఐ దివాకర్ అతి చేశారు. విద్యార్థులపై చేయి చేసుకొని, విద్యార్థులను నెట్టేసి దురుసుగా వ్యవహరించారు. ఇలా చేస్తే అధికార పార్టీ నేత దగ్గర ప్రశంసలు వస్తాయని భావించిన ఎస్సై దివాకర్‌కు పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అక్షింతలు పడ్డాయి.

చివరికి ఎస్సై దివాకర్‌ను అనకాపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నఫలంగా విశాఖ వీఆర్‌కు పంపారు.

ఎస్సై దివాకర్ వ్యవహారాన్ని కళాశాల యాజమాన్యం, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, డివిఎన్ కాలేజ్ కరస్పాండెంట్ రత్నాకర్ సీరియస్‌గానే తీసుకున్నారు.

తమ అనుమతి లేకుండా కళాశాలలోకి చొరబడడమే కాకుండా, విద్యార్థులను కొట్టడాన్ని దాడి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఎస్సై దివాకర్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు.

అదే సమయంలో జనసేన నాయకులు కూడా ఎస్సై దివాకర్ వ్యవహారాన్ని తప్పుపట్టారు. జై జనసేన అని నినాదించిన విద్యార్థులను కొట్టడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన నాయకులు కూడా దివాకర్ వ్యవహారాన్ని పోలీసు ఉన్నదా అధికారులకు తెలియజేశారు. దీంతో దివాకర్‌పై వేటుపడింది.

కాగా 2019 బ్యాచ్‌కి చెందిన దివాకర్ యాదవ్ మొదటి నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

రాజకీయ అండదండల నేపథ్యంలో ఎస్సై దివాకర్ తన స్థాయిని మరిచి పోలీస్ ఉన్నతాధికారులపై కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఉన్నత అధికారులతో కూడా ఎస్సై దివాకర్ ఆదిపత్య పోరు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

3,971 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?