
మావోయిస్టుల పేరుతో లేఖ.. బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యకు హెచ్చరికలు..
మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల పేరుతో లేఖ దర్శనమివ్వడం కలకలం రేపుతుంది. మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటి పేరుతో ఉన్న ఆ లేఖలో..
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు హెచ్చరికలు జారీ చేశారు. చిన్నయ్య, ఆయన అనుచరులు పద్దతి మార్చుకోవాలని మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ హెచ్చరించారు.
ఎమ్మెల్యే చిన్నయ్య.. విషపు చూపులు, కామా పిశాచి, అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ ఆరోపణలు చేశారు. అర్జిన్ డైరీకి సాయం అందించి ఎమ్మెల్యే చిన్నయ్య రైతులను నష్టపోయేలా చేశారని ఆరోపించారు.
ఎమ్మెల్యేకు అర్జిన్ డైరీ నిర్వాహకులు అమ్మాయిలను సరఫరా చేశారన్నారు. సమస్యలతో వచ్చే మహిళలను ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందని ఆరోపించారు.
పద్దతి మార్చుకోవాలని లేకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. అయితే ఈ లేఖపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ లేఖను మావోయిస్టులే రాశారా? లేదా వేరే ఎవరైనా మావోయిస్టుల పేరుతో లేఖ రాశారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే ఇటీవల బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు.
ఎమ్మెల్యే చిన్నయ్యపై ఓ డెయిరీ సంస్థలో భాగస్వామిగా ఉన్న మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. చిన్నయ్య తమను మోసం చేశాడని, ఆయన వద్దకు అమ్మాయిలను పంపించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.
బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటుకు సాయం చేస్తానని చెప్పి ఎమ్మెల్యే చిన్నయ్య డబ్బులు తీసుకున్నారని.. ఇందుకోసం ఆయన చెప్పినట్టుగా విన్నామని తెలిపారు. చిన్నయ్య తమను నమ్మించి మోసం చేశాడని..
తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
ఈ మేరకు ఆ మహిళ ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ”బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మమ్మల్ని నమ్మించి, మా నుంచి డబ్బులు తీసుకొని మాపైనే తప్పుడు కేసులు పెట్టించి రిమాండ్కు పంపించారు. దుర్గం చిన్నయ్యను మా బ్రాంచి ఓపెనింగ్ కోసం ఫస్ట్ టైమ్ కలిశాం.
అప్పుడు మీ కంపెనీలో మాకు తెలిసిన వాళ్లకు షేర్ ఇవ్వండి.. మీకు ఫుల్ సపోర్టు చేస్తాను, ఏం కావాలన్న చేసినపెడతానని చెప్పారు. మేం దానికి ఒకే చెప్పి.. ఆయన చెప్పిన పర్సన్కు షేర్ ఇచ్చాం. ఆ తర్వాత మాకు రెండెకరాల స్థలాన్ని ఇచ్చారు.
ఆ స్థలం ఆయనదేనని చెప్పారు. ప్లాంటు కన్స్ట్రక్షన్ పనులను సాన శ్రావణ్, థామస్ అనే ఇద్దరు వ్యక్తులకు అప్పగించమని చెబితే.. మేము దానికి కూడా అంగీకరించాం.
బిజినెస్ మీటింగ్ కోసం ఎమ్మెల్యే క్వార్టర్స్లో రెగ్యులర్గా చిన్నయ్యను కలిసేవాళ్లం. మేము ఒకరోజు బిజినెస్ పని మీద మాట్లాడేందుకు ఎమ్మెల్యే క్వార్టర్స్కు వెళ్లాం. అప్పుడు మాతో పాటు ఒక అమ్మాయి కూడా వచ్చింది.
ఒక రెండు మూడు సార్లు ఇలా బిజినెస్ మీటింగ్ కోసం కలిశాం. అయితే ఒక రోజు ఎమ్మెల్యే చిన్నయ్య కాల్ చేసి మీతోపాటు వచ్చిన అమ్మాయిని నైట్కు పంపిస్తారా? అని అడిగాడు.
ఆ అమ్మాయి అలాంటిది కాదు… కుదరదని చెప్పాను. మేము ఇలాంటివి చేయలేమని గట్టిగా మాట్లాడినం.
అయితే ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయిని పంపించాలని ఎమ్మెల్యే అన్నారు. అమ్మాయిని పంపించాల్సిందేనని.. లేదంటే మీ ఇష్టం అంటూ బెదిరింపులకు దిగాడు.
ఇక చేసేదేమి లేక.. తెలిసిన వారి నుంచి బ్రోకర్ నెంబర్ ఇస్తే.. ఆయనతో కాంటాక్ట్ చేస్తే వారితో మాట్లాడుకుని టచ్లో ఉన్నాడు.
తర్వాత దళితబంధు విషయమై మాట్లాడాలంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్కు పిలిపించారు. అక్కడ అల్కహాల్ ఏర్పాటు చేసి.. తాగమని నన్ను బలవంతం చేశాడు.
నేను తాగనని, అలవాటు లేదని అక్కడి నుంచి వెళ్లిపోయాను. మళ్లీ ఆయన ఫోన్ చేసి దళిత బంధు గురించి మాట్లాడాలని.. బెల్లంపల్లికి రమ్మని పిలిపించారు. మేము ఒప్పుకోకుంటే.. అలాంటిదేమి ఉండదని చెప్పారు. మేము వెళ్లిన తర్వాత కొంతసేపు మాట్లాడి పోలీసులకు అప్పజెప్పారు.
దీంతో పోలీసులు మమ్మల్ని పోలీసులు మూడు రోజులు స్టేషన్లో పెట్టారు. మా మీద తప్పుడు కేసులు పెట్టి.. ఇబ్బందులకు గురిచేశారు. తాము ఏం చేయలేదని చెబితే.. పోలీసులు వినిపించుకోలేదు.
ఎమ్మెల్యేతో మాట్లాడుకుంటే.. ఏం జరగదని కూడా చెప్పారు. దీంతో పోలీసులు కూడా ఇలా ఉంటారా? అని అనిపించింది. ఆ తర్వాత మమల్ని ఆదిలాబాద్ జిల్లా జైలుకు రిమాండ్కు తరలించారు.
20 రోజుల తర్వాత కండీషన్ బెయిల్పై బయటకొచ్చాం. ప్రతి శని, ఆదివారాల్లో బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో మేం హాజరవ్వాలి. బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఆయన మనుషులతో ప్రాణహాని ఉంది. మమల్ని కాపాడాలని వేడుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
ఇక, ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారడంతో.. రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అయితే తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఆరోపణలు చేశారన్నారు.
రైతుల నుండి లక్షలాది రూపాయాలను వసూలు చేసిన ఆర్జిన్ డెయిరీ సంస్థపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తనపై ఉద్దేశ్యపూర్వకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని విమర్శించారు.