
మానవత్వం చాటుకున్న పోలీసులు..!
రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. పెట్టుబడుల భారం, ఎరువుల కొరత, కూలీల కొరత, నీటి కొరత, విత్తనాల సమస్య.. ఇలాంటివన్నీ ఎదుర్కొని, ఆరుగాలం చెమటోడ్చి కష్టపడినా.. చివరికి పంట చేతికొచ్చే దశలో ప్రకృతి వైపరీత్యాలు వారి ఆశలపై కన్నీళ్లు చల్లే ముప్పు ఉంది.
ప్రస్తుతం అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి విషాదాలనే నింపుతున్నాయి. అలాంటి కష్ట సమయంలో పోలీసులు మానవత్వం చాటుకున్నారు.
అకాల వర్షం నుంచి పంట తడవకుండా కాపాడేందుకు రైతును అండగా నిలిచారు. మిర్చి పంటను కాపాడి రైతు మోముపై చిరునవ్వు నింపారు.
సూర్యాపేట (Suryapet) జిల్లా మఠంపల్లి మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
గాలివానను, బురదను లెక్క చేయకుండా రైతులకు అండగా నిలిచిన పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో శుక్రవారం (మార్చి 31) ఎద్దుల పందేలు జరిగాయి.
మఠంపల్లి ఎస్సై రవి కుమార్ తన సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమానికి బందోబస్తు విధులకు వెళ్లారు.
కార్యక్రమం పూర్తై తిరిగొస్తుండగా.. అప్పుడే అకాల వర్షం మొదలైంది. రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొంత మంది రైతులు.. కల్లాల్లో తడుస్తున్న మిర్చి పంటను కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారు.
అది గమనించిన ఎస్సై రవి వెంటనే తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపించి అక్కడికి పరుగెత్తారు. కవర్లను (పరదాలు) కప్పడంలో రైతులకు సహాయపడ్డారు.
గాలి వానను సైతం లెక్కచేయకుండా ఎస్సై రవి, ఇతర పోలీసు సిబ్బంది.. మిర్చి పంటపై కవర్లను కప్పారు. గాలికి కొట్టుకుపోకుండా పెద్ద పెద్ద బండరాళ్లను మోసుకొచ్చి వాటిపై ఉంచారు.
పోలీసులు చేసిన ఈ పనిని అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలను చూసి ‘శెభాష్ పోలీస్’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు