
ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి
నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు.
తమ పిల్లల పట్ల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనరసింహమూర్తి అసభ్యంగా ప్రవర్తించాడంటూ తల్లిదండ్రులు ఆరోపించారు.
ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రధానోపాధ్యాయుడికి మరోఉపాధ్యాయిని సహకరించిందని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.
ఇద్దరు ఉపాధ్యాయులపై గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఎంఈవో జ్యోతి కిరణ్, గ్రామీణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నరసింహమూర్తిని గ్రామీణ పోలీసులు స్టేషన్కు తరలించారు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం మండలంలోని ఉప్పలపాడు హైస్కూలు నుండి ప్రమోషన్పై రావిపాడు ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన లక్ష్మీ నరసింహమూర్తి అదే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
దీంతో విద్యార్థినులు తమ ఇళ్లల్లో ఈ విషయం చెప్పి ఆవేదన చెందారు. ఈ మేరకు పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయుడిని తల్లిదండ్రులు వివరణ కోరగా అతడితోపాటు సహకరించిన మరో ఉపాధ్యాయురాలు కూడా ఇష్టం వచ్చినట్లుగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో ఆగ్రహించిన గ్రామస్థులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.