
చోరీ చేశాడని దాడి.. నిందితుడి మృతి
విద్యుత్తు తీగలు చోరీ చేసి తీసుకెళ్తుండగా పట్టుకున్న రైతులు నిందితుడిని కొట్టడంతో మృతి చెందిన ఘటన ఇది.
ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలాల వద్ద విద్యుత్తు తీగలు, స్టార్టర్లు చోరీకి గురవుతున్నాయని, దొంగను పట్టుకోవాలనే ఉద్దేశంతో రైతులు శనివారం రాత్రి కాపుకాశారు.
గుమ్మడిదలకు చెందిన ఎం.మల్లేష్(30) వ్యవసాయ బోరు బావి వద్ద విద్యుత్తు తీగలు, స్టార్టర్ చోరీ చేసి తీసుకెళ్తూ వారికి పట్టుబడ్డాడు.
ఆగ్రహించిన కర్షకులు మల్లేష్ను కొట్టుకుంటూ గ్రామంలోకి తీసుకెళ్లారు. అక్కడ చెట్టుకు కట్టేసి కొట్టగా.. తీవ్ర గాయాలతో మల్లేష్ అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి, సీఐ వేణుకుమార్, గుమ్మడిదల ఎస్సై విజయకృష్ణ గ్రామంలోకి వెళ్లి వివరాలు సేకరించారు.
మల్లేష్ భార్య మీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.