
ట్యాంకరును శుద్ధి చేసేందుకు దిగిన ఇద్దరు కూలీల మృతి
బూర్గంపాడు : ట్యాంకరును శుద్ధి చేసేందుకు దిగిన ఇద్దరు వలస కూలీలు మృతి చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో బుధవారం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా కాంకెపుర గ్రామానికి చెందిన సోదరులు బుద్ధారాం(23), జోగ(21) లక్ష్మీపురంలోని ఓ కోడిగుడ్డు అట్టల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నారు.
కర్మాగారంలోని పల్ప్ ట్యాంకర్ను శుద్ధి చేయడానికి ఇద్దరూ బుధవారం దిగారు. ట్యాంకర్ను శుద్ధి చేస్తున్న క్రమంలో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నారు.
వారిని మిగతా కార్మికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
బుద్ధారాం, జోగలను బయటకు తీయడానికి దిగిన రాంబాబు అనే స్థానిక కార్మికుడు సైతం అస్వస్థతకు గురయ్యాడు.