Maharashtra: మహారాష్ట్రలో ట్రైనీ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ స్వల్ప గాయాలతో బయటపడింది. పూణె జిల్లాలో ఇందాపూర్ తాలూకాలోని కడ్బన్ వాడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ట్రైనీ విమానం ఎవరూలేని మైదానంలో కూలడంతో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఈ విమానం ఓ ప్రైవేట్ ఏవియేషన్ స్కూల్ది. 22ఏళ్ల మహిళా ట్రైనీ పైలట్ భావికా రాథోడ్ విమానంలో ఒంటరిగా ఫూణెలోని బారామతి విమానాశ్రయంలో బయలుదేరింది. సాంకేతిక లోపం కారణంగా ఈ విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్లైట్ కూలడంతో భారీ శబ్ధం వచ్చింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఘటన స్థలానికి చేరుకొని చూడగా.. భావనా రాథోడ్ స్వల్ప గాయాలతో కనిపించింది.
స్వల్ప గాయాలైన భావనా రాథోడ్ను వెంటనే ప్రథమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.