అనంతపురం : మండలానికి మెజిస్ట్రేట్.. జవాబుదారీగా ఉండాల్సిన అధికారి దారి తప్పారు. మద్యం, మగువ, మనీ కోసమే ఉద్యోగమంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. వారానికి పాతిక లక్షలు అక్రమంగా ఆర్జిస్తున్నాడు..వీకెండ్లో అమ్మాయిలతో బెంగళూరుకు వెళ్లి సేదదీరుతున్నాడు. ఇటీవల ఈ అధికారి అవినీతి అక్రమాలపై ఓ వృద్ధురాలు కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేయగా.. ఆమె ఆర్డీఓను విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన ఆర్డీఓకు కళ్లుబైర్లుకమ్మే నిజాలు తెలియడంతో ఆయన సమగ్ర నివేదిక సిద్ధం చేసి కలెక్టర్కు సమర్పించారు. ఆమె దాన్ని సీసీఎల్ఏకు పంపనున్నట్లు తెలుస్తోంది. గతంలో ధర్మవరం రెవెన్యూ డివిజన్లో పనిచేసిన సదరు తహసీల్దార్పై అవినీతి అరోపణలు వెల్లువెత్తాయి. భారీగా ముట్టజెప్పనిదే ఆయన పనిచేయరని బాధితులు గగ్గోలు పెట్టారు. పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సొంత శాఖ ఉద్యోగిపై ప్రేమ చూపిన అధికారులు ఆ తహసీల్దార్ను అక్కడి నుంచి ఉరవకొండ నియోజకవర్గానికి బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన పనితీరు మార్చుకోలేదు. పాత రూటులోనే వెళ్తూ భారీగా వెనకేసుకున్నారు. సంవత్సరం వ్యవధిలోనే 350 మ్యుటేషన్లు చేశారు. ఇందులో 23 అనధికారికంగా చేసినట్లు విచారణలో తేలింది. ఏకంగా రూ.6 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. అనంతపురం అశోక్నగర్లో రూ.1.50 కోట్లు విలువైన భవనంలో ఉంటున్న సదరు అధికారి…సమీపంలో ఉన్న రూ.2 కోట్ల బిల్డింగ్ కొనుగోలుకు రూ.50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిసింది. మరో అపార్టుమెంట్ కూడా బినామీల పేరుతో కొనుగోలు చేసి ఆధునికీకరణ పనులు చేయిస్తున్న సమాచారం.
♦బెంగళూరులో ఆరు అంతస్తుల అధునాతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
♦ఇటీవలే కాలువపల్లి సమీపంలో 30 ఎకరాల దానిమ్మతోట కొనుగోలు చేసినట్లు అధికారులే గుర్తించారు.
తాను పనిచేసే మండల కేంద్రంలో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులను చేరదీసి దందాలకు దిగాడు. ఒక ఆర్ఎస్ఐ, వీఆర్ఓ, ఆర్ఐలతో జట్టుకట్టి భూ వివాదాలకు తెరతీశారు. రైతులు తమకు జరిగిన అన్యాయంపై నోరు మెదపాలని చూస్తే ఓ వైపు పోలీసులను, మరో వైపు రెవెన్యూ సిబ్బందిని అడ్డు పెట్టుకుని దారికి తెచ్చుకుంటున్నారు.
వీడియో కాల్స్తో…
భారీగా ఆర్జిస్తున్న సదరు తహసీల్దార్కు అమ్మాయిలపై వ్యామోహం ఎక్కువ. పైగా ఉదయం 11 గంటల నుంచి మద్యం మత్తులో ఉంటాడని అధికారులే చెబుతున్నారు. కార్యాలయంలో గంట కూడా ఉండని ఆయన…ఆ తర్వాత తన మండల పరిధిలోనే ఓ గదిలో మహిళలతో కలిసి రాచకార్యాలు వెలగబెడుతుంటారని చెబుతున్నారు. యువతులకు డబ్బు ఎరవేసి బలితీసుకునే సదరు అధికారి తనకు నచ్చిన యువతి… ముందుగా వీడియో కాల్లో నగ్నంగా చూడాలని షరతు పెడతాడు. ఆ తర్వాతే ఆమెతో గడుపుతాడు. నచ్చితే తనతో పాటు కారులో తీసుకెళతాడు. అనంతపురం నగరంలోని మూడ నక్షత్రాల హోటల్లో ఆయన బస చేస్తారని తెలుస్తోంది. ఇలా కొందరితో సదరు తహసీల్దార్ చేసిన వీడియో చాట్లు ఇప్పుడు బహిర్గతం కాగా, ఉన్నతాధికారులు వాటిని కూడా నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.